చెన్నై: తమిళ నటుడు సూర్య కోర్టు ధిక్కార కేసు ఎదుర్కొనే అవకాశం ఉందని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఎస్.ఎం. బాల సుబ్రహ్మణియన్ తెలిపారు. వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ కారణంగా ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై కథానాయకుడు సూర్య ఆవేదన వ్యక్తం చేస్తూ పేర్కొన్న మాటలు కోర్టు ధిక్కారం కిందకు వస్తుందంటూ ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ను నిర్వహించాలని సుప్రీం కోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘‘తమ ప్రాణాల గురించి భయపడుతున్న న్యాయమూర్తులకు.. విద్యార్థులను నీట్ పరీక్షలకు హాజరు కావాల్సిందిగా ఆదేశించే నైతిక హక్కు లేదనే ఉద్దేశాన్ని ఈ ప్రకటన వెల్లడిస్తోందని” సుబ్రహ్మణియన్ వెల్లడించారు. ఈ విషయమై ఆయన సూర్య తమిళంలో పేర్కొన్న మాటలను ఇంగ్లీష్లోకి అనువదించి మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. దీనిపై త్వరలోనే న్యాయమూర్తి సమీక్షించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
SURIYAagainstNEET
‘‘డాక్టర్ కావాలని కలలు కన్న పేద విద్యార్థుల కలల్ని ‘నీట్’ చంపేసింది. విద్యార్థుల ఆత్మహత్య విషయంలో మేం మౌనంగా ఉండం..’’ అంటూ విద్యా వ్యవస్థ తీరును విమర్శించారు. ప్రజలు ‘నీట్’ను వ్యతిరేకించాలని సూర్య ట్విటర్లో ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆయనకు మద్దతుగా నెటిజన్లు సైతం మద్దతు పలుకుతున్నారు. SURIYAagainstNEET అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ చేస్తున్నారు. ఇదే సంఘటనపై నటుడు మాధవన్, విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా కేంద్ర ప్రభుత్వం తీరును తప్పుపడుతూ సూర్యకు మద్దతు ప్రకటించడం గమనార్హం.