Reservations in wines : మద్యం దుకాణాలకు రిజర్వేషన్లకు నూతన పాలసీ
ప్రభుత్వం మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లు అమలుచేస్తూ నూతన మద్యం విధానాన్ని ప్రకటించింది.
దుకాణాల కేటాయింపులో గౌడ్లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ను కల్పించింది.
ఈ మేరకు రాష్ట్రంలో 2021-23 సంవత్సరాలకు గాను నూతన మద్యం పాలసీ విధివిధానాలను ఖరారు చేసింది.
దీనిపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
జిల్లాను యూనిట్గా తీసుకొని రిజర్వేషన్లు ఖరారుచేశారు.
ఏయే దుకాణాలు ఏ రిజర్వేషన్లోకి వస్తాయన్నది నిర్ణయించిన తరువాత దరఖాస్తు గడువును ఎక్సైజ్ కమిషనర్ నిర్ణయిస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
లైసెన్సు ఫీజును యథాతథంగా కొనసాగించిన ప్రభుత్వం, ఈ సారి నుంచి దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లను అమలు చేయనున్నట్టు తెలిపింది.
ఏ4 లిక్కర్ షాప్ (వైన్స్)లకు దరఖాస్తు ఫీజు, కాలపరిమితి, ఇతర నిబంధనలను మద్యం పాలసీలో ఖరారు చేసింది.
మద్యం దుకాణాల లైసెన్సు కోసం దరఖాస్తు ఫీజును గతంలో ఉన్నట్టుగానే రూ.2 లక్షలుగా నిర్ణయించారు.
గతంలో మాదిరిగానే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలోనే దుకాణాలను కేటాయించనున్నారు.
జీహెచ్ఎంసీ వెలుపల ఐదు కిలోమీటర్ల వరకు కూడా నగరంలో వసూలు చేసే ఎక్సైజ్ పన్నే వర్తిస్తుందని నిబంధనల్లో పేర్కొన్నారు.
అదేవిధంగా మున్సిపాలిటీలలో కూడా వాటి పరిధికి వెలుపల రెండు కిలోమీటర్ల వరకు అదే ఫీజు వర్తిస్తుందని స్పష్టంచేశారు.
జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి11 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు తెరిచి ఉంటాయని నూతన పాలసీలో పేర్కొన్నారు.
2011 జనాభా ప్రాతిపదికన మద్యం దుకాణాలకు ఎక్సైజ్ వార్షిక పన్నును నిర్ణయించారు.