నటి శ్రీదేవి కూతురిని ఇండస్ట్రీకి పరిచయమై.. మంచి పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు జాన్వీ కపూర్. ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. తన కెరీర్ ప్రారంభంలో శ్రీదేవి కుమార్తె అయిన కారణంగా అభద్రతా భావానికి గురైనట్లు చెప్పారు. తన తొలి సినిమా ‘ధడక్’ షూటింగ్కు శ్రీదేవిని రావొద్దని కూడా చెప్పినట్లు తెలిపారు.‘నేను శ్రీదేవి కుమార్తె కావడంతోనే నాకు అవకాశాలు వచ్చాయని అందరూ అనుకున్నారు. అందుకే అమ్మను దూరం పెట్టాను. ఆమె నుంచి ఎలాంటి సాయం తీసుకోకూడదనుకున్నా. ఆమెలా కాకుండా భిన్నంగా నటించి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించా. నా తొలి సినిమా సెట్స్కు కూడా ఆమెను రావొద్దని, నాకు సాయం చేయద్దని చెప్పాను. ఆమె కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమవ్వడంతో ఎందుకో అభద్రతా భావానికి లోనయ్యేదాన్ని. ఆమె సలహాలు కూడా తీసుకునేదాన్ని కాదు. నేనంత హాస్యాస్పదంగా ఆలోచించానో ఆ తర్వాత అర్థమైంది. ఇప్పుడు ప్రతి విషయం ఆమెకు చెప్పాలనిపిస్తుంది.
‘అమ్మా.. షూట్ ఉంది. త్వరగా రా’ అని ఆమెతో చెప్పినట్లు అనిపిస్తుంది. ఆమె కూతురినైనందుకు ఇప్పుడు ఎంతో గర్వపడుతున్నా. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అని అభిమానులు అంటుంటే ఆనందంగా ఉంది’అని చెబుతూ జాన్వీ భావోద్వేగానికి గురయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇప్పుడు ‘దేవర’తో టాలీవుడ్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు జాన్వీ. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ మాస్ యాక్షన్ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో విలన్గా నటిస్తున్నారు. జాన్వీ కపూర్ ఇందులో తంగమ్ అనే పాత్రలో కనువిందు చేయనున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తొలి భాగం ‘దేవర పార్ట్ 1’ పేరుతో ఏప్రిల్ 5న విడుదల కానుంది.