ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పంగనామాలు పెడుతోందని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 80 శాతం మంది రైతులు దొడ్డు వడ్లు పండిస్తుంటే సన్న వడ్లకే బోనస్ ఇస్తామనడడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దొడ్డు వడ్లు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే .. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఈ మాట ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన హామీలు ఇచ్చి పవర్ లోకి వచ్చిందని ఆరోపించారు. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు ఆగస్టు 15లోగా అమలు చేస్తామంటూ కొత్త రాగం అందుకున్నదని విమర్శించారు. రబీ సీజన్ లో మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రం ఒప్పందం కుదుర్చుంటే కాంగ్రెస్ సర్కారు రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. ధాన్యం తడిచి మొలకెత్తుతున్నా ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు.
ఒట్ల పేరుతో పెద్ద మోసం
దేవుళ్లపై ఒట్ల పేరుతో రేవంత్ రైతులను మోసం చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. వరి పంటకు బోనస్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని అన్నారు. డిసెంబర్ 9వ తేదీనే రుణమాఫీ చేస్తానని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడేమో ఆగస్టు 15లోగా చేస్తామని అంటున్నారని సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో 80 శాతం దొడ్డు వడ్లనే పండిస్తారని.. చాలా తక్కువ మంది మాత్రమే సన్న వడ్లు పండిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు.