విజయవాడ : పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో ప్రజల అనారోగ్యానికి సంబంధించిన కారణాలను గుర్తించే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ నిపుణులు దర్యాప్తు కోసం ముందుకు వచ్చారు.
సోమవారం ఉదయం వరకు ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో 340 కేసులు నమోదు కాగా.. 45 ఏళ్ల వ్యక్తి ఒకరు మరణించగా.. 168 మంది డిశ్చార్జి అయ్యారు.
ప్రస్తుతం 157 మంది చికిత్స పొందుతున్నారు. 14 మందిని మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అయితే ఈ అంతుచిక్కని వ్యాధి ఒకరినుంచి మరొకరికి మాత్రం సోకలేదని అధికారులు పేర్కొన్నారు.
అయితే ఘటనకు మాత్రం ఏలూరు మున్సిపాలిటీ పంపిణీ చేసిన నీరే కారణమని భావిస్తుండగా.. ఆ నీళ్లు తాగని ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు సైతం అనారోగ్యానికి గురయ్యారు.
పరామర్శించిన సీఎం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ను సందర్శించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు.
ఆరోగ్య పరిస్థితి రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న చికిత్సలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగన్ అధికారులతో సమీక్షించారు.
అనారోగ్యానికి దారితీసిన పరిస్థితులు, పరీక్షలు, నీటి టెస్టులు, రక్త నమూనాల ఫలితాలు వెంటనే తెలుసుకోవాలని ఆదేశించారు. నీటి నమూనాలను పరిశీలిస్తే సాధారణంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
రక్త పరీక్షలు, సిటీస్కాన్ రిపోర్టుల్లో సైతం సాధారణంగానే ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఏలూరు పట్టణం, గ్రామీణ, దుందులూరు మండలాల్లోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదవగా.. హాస్పిటల్లో చేరారు. మంగళగిరికి చెందిన ఎయిమ్స్ నిపుణుల బృందం హాస్పిటల్ను సందర్శించి, రోగులతో మాట్లాడారు.
ఏలూరుకు డబ్ల్యూహెచ్ నిపుణులు
అనారోగ్యానికి గల కారణాలపై మరింత దర్యాప్తు చేసేందుకు ఐఐసీటీ, సీఎంఆర్ నిపుణులు రానున్నట్లు వివరించారు.
ఆరోగ్యశాఖ కమిషనర్ భాస్కర్ మాట్లాడుతూ పరిస్థితి అదుపులోనే ఉందని మీడియాకు తెలిపారు.
భయపడాల్సిన అవసరం లేదని, వైద్య బృందాలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు. నీటి కాలుష్యమే అనారోగ్యానికి కారణమన్న వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) నిపుణులు సోమవారం సాయంత్రం లేదంటే మంగళవారం ఏలూరుకు చేరుకుంటారని వివరించారు.