ఇదే నిజం, భూపాలపల్లి: పేద ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు 6 గ్యారెంటీ పథకాలను అందించేందుకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టామని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. శనివారం కాటారం మండలం ధన్వాడ గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ యంత్రాంగమే ప్రజల వద్దకు వచ్చి గ్యారెంటీ పథకాల దరఖాస్తులు స్వీకరిస్తుందన్నారు. పేద ప్రజల కోసమే ప్రజా పాలన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ప్రజలు జనవరి 6 వరకు తమ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తు సమర్పించవచ్చని మంత్రి అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.