Homeహైదరాబాద్latest Newsఇది ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన: కేటీఆర్

ఇది ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన: కేటీఆర్

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: హ‌త్యా రాజ‌కీయాలు తెలంగాణ‌కు మంచిది కాద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నాలుగు నెల‌ల కాలంలోనే ఇద్ద‌రు బీఆర్ఎస్ నేతల హ‌త్య‌ల‌కు కార‌ణ‌మైన మంత్రి జూప‌ల్లి కృష్ణారావును మంత్రివ‌ర్గం నుంచి స‌స్పెండ్ చేయాల‌ని ఆయన డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కొల్లాపూర్ సెగ్మెంట్ ల‌క్ష్మీప‌ల్లిలో బుధవారం అర్ధరాత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత బొడ్డు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ గురువారం కొల్లాపూర్​లోని లక్ష్మీపల్లికి చేరుకున్నారు. బొడ్డు శ్రీధ‌ర్ రెడ్డి అంతిమ‌యాత్ర‌లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘శ్రీధ‌ర్ రెడ్డి హ‌త్య‌కు జూప‌ల్లి కృష్ణారావే బాధ్య‌త వ‌హించాలి. ఇది మొద‌టి హ‌త్య కాదు. పేరుకేమో ప్ర‌జాపాల‌న.. చేస్తున్న‌ది ప్రతీకార పాల‌న‌. ప్ర‌తీకారంతో ర‌గిలిపోతూ ఎన్నిక‌ల్లో వ‌త్తాసు ప‌ల‌క‌ని వారి మీద‌ ప్రతీకారం తీర్చుకునే దిక్కుమాలిన పాల‌న‌ ఇది. ఈ హ‌త్యకు ప్ర‌భుత్వానిదే బాధ్య‌త. రాష్ట్రంలో ఎక్క‌డా లేని ఫ్యాక్ష‌న్ కల్చర్​ను మంత్రి జూప‌ల్లి కొల్లాపూర్‌లో తీసుకొచ్చారు. జ‌న‌వ‌రిలో మల్లేష్ యాద‌వ్‌, ఇప్పుడు శ్రీధ‌ర్ రెడ్డి హ‌త్య‌కు ఆయన కార‌ణ‌మ‌య్యారు. ఒక‌టే నియోజ‌క‌వ‌ర్గంలో నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలో రెండు హ‌త్యలు జ‌రిగాయి. మంత్రి ప్ర‌మేయం, ప్రోద్బ‌లం లేకుండా ఆయ‌న అనుచ‌రులు ఇంత దారుణాల‌కు తెగ‌బ‌డ‌రు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్త‌శుద్ధి ఉంటే జూప‌ల్లి కృష్ణారావును మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలి..
స్థానికంగా ఉండే పోలీసు వ్య‌వ‌స్థ మీద మాకు న‌మ్మ‌కం లేదని కేటీఆర్ తెలిపారు. వ‌రుస హ‌త్య‌ల‌పై ప్ర‌త్యేక ద‌ర్యాప్తు సంస్థ‌ను ఏర్పాటు చేయాలన్నారు. లేదంటే జ్యుడిషియ‌ల్ విచార‌ణ‌కు ఆదేశించాలన్నారు. ‘ఈ హ‌త్య‌ల్లో ప్ర‌భుత్వ పాత్ర‌, మంత్రి పాత్ర లేక‌పోతే నిష్ప‌క్ష‌పాతంగా విచార‌ణ జ‌రిగేందుకు స‌హ‌క‌రించాలి. కొల్లాపూర్ ప్రాంతంలో హింసాయుత‌మైన సంస్కృతి క‌న‌బ‌డుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. చెల‌రేగిపోతున్నారు. అయినా పోలీసులు ప్రేక్ష‌కపాత్ర వ‌హిస్తున్నారు. ఈ ఏరియాను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలి. ఇక్కడ పికెట్లు, పోలీస్ క్యాంప్​లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే బీఆర్ఎస్​ నేతలు డీజీపీని క‌లిశారు’అని కేటీఆర్ గుర్తు చేశారు.

ఎస్సైను సస్పెండ్ చేయాలి..
శ్రీధ‌ర్ రెడ్డి హ‌త్య‌కు గురైన‌ట్లు ఉద‌యం 5.30 గంటలకు పోలీసుల‌కు ఫోన్ చేస్తే గంట‌న్న‌ర త‌ర్వాత వ‌చ్చి ప్రేక్ష‌క‌పాత్ర పోషించారని కేటీఆర్ ఆరోపించారు. ఈ కేసులో ముందుగా ఎస్ఐని స‌స్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘మా కార్య‌క‌ర్త‌లు కూడా ర‌గిలిపోతున్నారు. ఇదే దాడుల సంస్కృతి కొన‌సాగితే మేం కూడా నియంత్రించ‌లేం. ఈ సంస్కృతి రాష్ట్రానికి మంచిది కాదు. ఇలాగే హ‌త్య రాజ‌కీయాలు కొన‌సాగితే మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టిడికి కూడా వెనుకాడం. శ్రీధ‌ర్ రెడ్డి తండ్రిని స‌ముదాయించ‌లేక‌పోతున్నాం. శ్రీధ‌ర్ రెడ్డి హ‌త్య వెనుకాల జూప‌ల్లి కృష్ణారావు ఉన్నారని కేసు పెడితే, మంత్రి పేరు ఉప‌సంహ‌రించుకోవాల‌ని పోలీసులు ఒత్తిడి తెస్తున్నారు. హ‌త్య‌లు, దాడులు, కేసులు, సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడితే బెదిరింపులు, బైండోవ‌ర్లు.. ఇదేనా రాజ‌కీయం’అని అధికార కాంగ్రెస్ పార్టీని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ఈ సంస్కృతి కొన‌సాగితే తెలంగాణ‌కు మంచిది కాదన్నారు. ఈ హ‌త్యా రాజ‌కీయాల‌కు తెర దించాలన్నారు. శ్రీధ‌ర్ రెడ్డి కుటుంబానికి అండ‌గా ఉంటామని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img