ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల కష్టాన్ని, సహకారాన్ని గుర్తిస్తూ.. ప్రతి సంవత్సరం మే 1వ తేదీన మేడే నిర్వహిస్తారు. దీనినే అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం అని కూడా పిలుస్తారు. కార్మికుల సహకారాన్ని గుర్తుచేయడమే కాకుండా.. కార్మికుల హక్కులను గుర్తుచేస్తూ.. సమాజానికి వారు చేస్తున్న సేవలకు తగిన గుర్తింపు ఇవ్వడమే లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నారు.
కార్మిక దినోత్సవాన్ని 19వ శతాబ్ధం నుంచి యూనైటెడ్ స్టేట్స్ నిర్వహించినట్లు చరిత్ర చెప్తోంది. దానికి బీజం 1886లో ప్రారంభమైంది. 1886లో మే 1వ తేదీన దాదాపు రెండు లక్షలమంది కార్మికులు.. తమ శ్రమను గుర్తిస్తూ.. రోజుకు ఎనిమిది గంటల పనిదినాన్ని డిమాండ్ చేస్తూ భారీ సమ్మెను చేశారు. ఆ సమయంలో ఈ ఉద్యమం హింసాత్మకంగా మారింది.
ఉద్యమం హింసాత్మకంగా మారడంతో.. చికాగోలోని హేమార్కెట్ స్క్వేర్లో కార్మికులు శాంతియుత సమావేశమయ్యారు. ఆ సమయంలో బాంబు పేలడంతో ఎందరో నిరసనకారులు, పోలీసులు ప్రాణాలు విడిచారు. అప్పటినుంచి ఈ ఘటనను గౌరవిస్తూ.. మే డేని చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో 1889 మే 1న కార్మికుల దినోత్సవాన్ని నిర్వహించాలని అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్లో నిర్ణయించారు. 1890 నుంచి అధికారికంగా వేడుకలు నిర్వహించారు.