Homeహైదరాబాద్latest Newsనేడు అంబేద్కర్ 134వ జయంతి

నేడు అంబేద్కర్ 134వ జయంతి

నేడు రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. భీమ్‌రావు అంబేద్కర్‌ 134వ జయంతి. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఈ దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్యరణీయం. స్కేచ్ఛ, సమానత్వం, అంటరానితనం నిర్మూలన వంటి అంశాలపై అంబేద్కర్ ఎంతగానో పోరాడారు.

బాబాసాహెబ్ అంబేద్కర్ మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో 1891 ఏప్రిల్ 14న జన్మించారు. తల్లిదండ్రులకు 14వ చివరి సంతానం. తండ్రి సుబేదార్ రామ్‌జీ మాలోజీ సక్పాల్. బ్రిటిష్ సైన్యంలో పనిచేశారు. అంబేద్కర్ తండ్రి సెయింట్ కబీర్ అనుచరుడు. తండ్రి పదవీ విరమణ చేసినప్పుడు అంబేద్కర్‌కు దాదాపు రెండు సంవత్సరాలు. ఆరేళ్ల వయసులోనే తల్లి చనిపోయింది. అప్పట్నుంచి అత్త దగ్గర పెరిగాడు. అంబేద్కర్ సతారాలో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ప్రాథమిక విద్యాభ్యాసం ముంబైలో పూర్తైంది. మెట్రిక్యులేషన్ తర్వాత ఆయన 1906లోనే వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఎల్ఫిన్‌స్టోన్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఒప్పందం ప్రకారం బరోడా ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. పై చదువుల కోసం లండన్ వెళ్లాడు. ఆయన న్యాయశాస్త్రాన్ని అభ్యసించడానికి గ్రేస్ ఇన్‌లో చేరారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీని పూర్తి చేశారు. జర్మనీలోని బాన్ యూనివర్సిటీలో కొంతకాలం చదువుకున్నారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, బరోడా మహారాజాకు సైనిక కార్యదర్శిగా పనిచేశారు.

1924లో ఇంగ్లండ్ నుంచి తిరిగి వచ్చిన తరువాత, అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఒక సంఘాన్ని ప్రారంభించారు. దీనికి సర్ చిమన్‌లాల్ సెతల్వాడ్ అధ్యక్షుడిగా, డాక్టర్ అంబేద్కర్ ఛైర్మన్‌గా ఉన్నారు. అణగారిన వర్గాలకు విద్యను అందించడం, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం, వాళ్లను వివక్ష నుంచి దూరం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే అణగారిన వర్గాల సమస్యలను పరిష్కరించడానికి బహిష్కృత్ భారత్ వార్తాపత్రికను ఏప్రిల్ 3, 1927న ప్రారంభించారు.

ఆ తర్వాత 1928లో బొంబాయిలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో ప్రొఫెసర్‌గా, జూన్ 1, 1935న అదే కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేసి 1938లో రాజీనామా చేసే వరకు అదే పదవిలో కొనసాగారు. 1936లో ఇండిపెండెంట్ లేబర్ రాజకీయ పార్టీని స్థాపించాడు. అది 1937లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పోటీ చేసి సీట్లను గెలుచుకుంది. ‘ది యానిహిలేషన్ ఆఫ్ కాస్ట్’ అనే పుస్తకంలో అంబేద్కర్ హిందూ మత పెద్దలను, కుల వ్యవస్థను తీవ్రంగా విమర్శించారు. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో కార్మిక శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు.

స్వాతంత్య్రానంతరం 1947లో దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తొలి మంత్రివర్గంలో న్యాయ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఆ క్రమంలో ఆయన రాజ్యాంగ సభ ముసాయిదా కమిటీకి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. డాక్టర్ అంబేద్కర్ ప్రధానంగా సమానత్వం, సామాజిక న్యాయం, అంటరానితనం వంటి దళితుల హక్కుల కోసం పోరాడారు. కానీ 1951లో కశ్మీర్ సమస్య, భారత విదేశాంగ విధానం, హిందూ కోడ్ బిల్లుకు సంబంధించి ప్రధాని నెహ్రూ విధానంతో విభేదాలు వ్యక్తం చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు.

1952లో కొలంబియా విశ్వవిద్యాలయం భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఎల్‌ఎల్‌డి డిగ్రీని ప్రదానం చేసింది. అతను అక్టోబర్ 14, 1956న నాగపూర్‌లో జరిగిన ఒక చారిత్రాత్మక కార్యక్రమంలో బౌద్ధమతం స్వీకరించాడు. 1948 నుంచి మధుమేహంతో బాధపడుతున్న బాబా సాహెబ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న ఢిల్లీలో నిద్రలోనే మరణించారు. బౌద్ధ సంప్రదాయం ప్రకారం ఆయన అంత్యక్రియలు జరిగాయి.

Recent

- Advertisment -spot_img