Homeజాతీయం#UP : త్వ‌ర‌లో 4 చిన్న రాష్ట్రాలుగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌..?

#UP : త్వ‌ర‌లో 4 చిన్న రాష్ట్రాలుగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌..?

ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ నాయకత్వ మార్పు, క్యాబినెట్ విస్తరణ దిశ‌గా అడుగులు వేస్తుంది బీజేపీ అధిష్టానం.

దీనికి కార‌ణం వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక పూర్వాంచల్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇదే విష‌యంపై చ‌ర్చించేందుకు యోగి ఆదిత్య‌నాథ్ గ‌త రెండు రోజులుగా ఢిల్లీలో మ‌కాం వేసి ప్ర‌ధాన‌మంత్రి మోదీతోపాటు హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డాల‌తో సుదీర్ఘంగా చ‌ర్చిస్తున్నారు.

యూపీ ఎన్నిక‌ల‌పై అమిత్‌షా ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాలు చెప్తున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సన్నిహితుడు, మాజీ బ్యూరోక్రాట్ అయిన ఏకే శర్మను ఉత్తరప్రదేశ్‌కు పంపి అత‌డిని శాసనమండలి సభ్యుడిగా చేయడం కూడా దీనికి ముడిపడి ఉన్న‌ట్లుగా తెలుస్తున్న‌ది.

ప్రధాని పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో కొరోనా నిర్వహణ ప‌నుల‌ను శర్మ కొంతకాలంగా చూస్తున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, వ్యాక్సిన్ అంద‌క‌పోవ‌డం, ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం, అభివృద్ధి లేక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యావ‌కాశాలు మందగించిపోయాయి.

దాంతో రాష్ట్రాన్ని రెండు లేదా మూడు ముక్క‌లుగా చేసి మ‌రోసారి అక్క‌డ త‌మ హ‌వా త‌గ్గ‌లేద‌ని నిరూపించుకోవాల‌న్న ప‌నిలో బీజేపీ నిమ‌గ్న‌మై ఉన్న‌ది.

25 జిల్లాలు, 125 అసెంబ్లీ సీట్లు..

పార్టీ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం, గోరఖ్‌పూర్ సహా 23 నుంచి 25 జిల్లాలను పూర్వాంచల్ రాష్ట్రంగా ఏర్పాటు చేయ‌వ‌చ్చు.

ఇందులో 125 అసెంబ్లీ సీట్లు కూడా ఉంటాయి. అయితే, ఈ అంశాలపై యోగి శిబిరం అంగీకరించడం లేదని చెప్తున్నారు.

విశేషమేమిటంటే, ప్రత్యేక పూర్వంచల్, బుందేల్‌ఖండ్, హరిత్ ప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ చాలా కాలంగా కొనసాగుతున్న‌ది.

పూర్వాంచ‌ల్ అభివృద్ధి కోసం యోగి ప్ర‌భుత్వం 28 జిల్లాల‌ను ఎంపిక చేసి కార్యక్ర‌మాల‌ను చేప‌డుతున్న‌ది.

ఈ ప్రాంతంలో 2017 ఎన్నిక‌ల్లో బీజేపీ 115 సీట్లు గెలుచుకున్న‌ది.

అంత‌కుముందు 1991 లో తొలిసారి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన స‌మ‌యంలో కూడా బీజేపీ ఈ ప్రాంతంలో 82 సీట్ల‌లో గెలిచి ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించింది.

ఇక్క‌డి 10 జిల్లాల్లో బీజేపీ వెనుక‌బ‌డి ఉన్న‌ది.

బీజేపీకి అనుకూల‌మైన ఓటు బ్యాంకు లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఆ 10 జిల్లాల్లో ఎక్కువ సీట్ల‌ను కైవ‌సం చేసుకోలేక‌పోతున్న‌ద‌ని నిపుణులు చెప్తున్నారు.

పూర్వంచల్ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పడితే యోగి బలమైన కోట గోరఖ్‌పూర్ కొత్త రాష్ట్రంలో వస్తుంది.

యోగి 1998 నుంచి 2017 వరకు ఐదు సార్లు గోరఖ్‌పూర్ నుంచి లోక్‌స‌భ ఎంపీగా ఉన్నారు.

గోర‌ఖ్‌పూర్ కేంద్రంలో ఉన్న గోరక్షపీఠ్‌ మహాంత్‌గా యోగి ఉన్నారు.

అప్నాద‌ళ్‌కు క్యాబినెట్ బెర్త్‌

వ‌చ్చే ఏడాది జ‌రుగ‌నున్న యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోసారి అప్నాద‌ళ్ పార్టీతో పొత్తు కొన‌సాగే అంశంపై చ‌ర్చ‌లు ఇప్ప‌టి నుంచే జ‌రుగుతున్నాయి.

రెండు రోజుల క్రితం అప్నాద‌ళ్(ఎస్‌) ఎంపీ అనుప్రియ ప‌టేల్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయి ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు.

2014 లో మోదీ క్యాబినెట్‌లో చేరిన అనుప్రియ ప‌టేల్‌కు.. 2019 లో చోటు ద‌క్క‌లేదు.

ప్ర‌స్తుతం అమిత్‌షాతో భేటీ అవ‌డంతో ఆమెకు కేంద్ర క్యాబినెట్‌లో బెర్త్ ద‌క్కే అవ‌కాశాలు ఉన్నట్లు పార్టీ వ‌ర్గాలు చెప్తున్నాయి.

యూపీలో ఎమ్మెల్సీగా ఉన్న త‌న భ‌ర్త ఆశీష్ ప‌టేల్‌కు కూడా యోగి మంత్రిమండ‌లిలో చోటు క‌ల్పించే అంశంపై కూడా అనుప్రియ కేంద్ర పెద్ద‌ల‌తో చ‌ర్చించార‌ని తెలుస్తున్న‌ది.

స‌మాజ్‌వాది పార్టీతో క‌లిసి ప్ర‌యాణించాల‌ని అప్పాద‌ళ్ పార్టీ ఇటీవ‌ల నిర్ణ‌యించ‌డంతో వారిని సంతోష‌ప‌రిచి రానున్న ఎన్నిక‌ల్లో మ‌రోసారి అధికారం చేజిక్కించుకోవాల‌ని బీజేపీ యోచిస్తున్న‌ది.

Recent

- Advertisment -spot_img