జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నంత మాత్రాన గెలుపు ఖాయమని చెప్పలేమని టీమిండియా మాజీ ఓపెనర్ వీరెంద్ర సెహ్వాగ్ అన్నాడు. ముంబయి ఇండియన్స్ టీంలో హేమాహేమీలు ఉన్నప్పటికీ ప్రదర్శన సరిగా లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
‘ఒక మాట చెప్పండి. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ ఒకే సినిమాలో నటించినంత మాత్రాన అది హిట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. అది బ్లాక్బస్టర్ కావాలంటే.. వారి ప్రదర్శన మంచిగా ఉండాలి. బలమైన స్క్రిప్ట్ అవసరం. అలానే ఈ పెద్ద స్టార్లు బాగా నటించాలి. రోహిత్ శర్మ శతకం కొట్టాడు.. అయినా ముంబయి ఓడిపోయింది. మిగిలిన వారి ఆట ఎక్కడ చెప్పండి..? ఇషాన్ సీజన్ మొత్తం ఆడాడు.. కానీ, ఎప్పుడూ పవర్ ప్లేను దాటి నిలబడలేదు. ఈ పరిస్థితిలో ముంబయి జట్టులో ఇద్దరి పేర్లు మాత్రమే నిశ్చయంగా కొనసాగుతాయి. అవి బుమ్రా, సూర్యా. ఆ జట్టు రిటైన్ చేసుకోనే ఆటగాళ్లు వీరిద్దరే’’ అని పేర్కొన్నాడు.
ఈ సీజన్లో 13 మ్యాచ్లు ఆడిన ముంబయి ఇండియన్స్ ఇప్పటివరకూ కేవలం 4 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. టోర్నీ నుంచి ఇప్పటికే నిష్క్రమించింది. టీం పేలవ ప్రదర్శనకు హర్దిక్ కెప్టెన్సీయే కారణమంటూ నెట్టింట కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.