వరంగల్: తెలంగాణలో సంచలనం సృష్టించిన తొమ్మిది మంది హత్య కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో న్యాయస్థానం నిందితుడు సంజీవ్ కుమార్కి ఉరిశిక్ష ఖరారు చేసింది.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిందితుడిపై అభియోగాలను నిరూపించడంతో ఉరిశిక్ష ఖరారు చేస్తూ వరంగల్ మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జయకుమార్ తీర్పు వెల్లడించారు.
నిందితుడిపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటన జరిగిన నెల రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేయడం గమనార్హం. నిందితుడికి ఉరిశిక్ష పడటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ హత్యలను సీడీఆర్ (కాల్ డేటా రికార్డింగ్), గోదాం, గొర్రెకుంట ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగానే పోలీసులు కేసును ఛేదించారు.
గోనె సంచులు తయారు చేసే కేంద్రంలో మక్సూద్, అతడి భార్య పనిచేసేవారు. ఈ క్రమంలోనే బిహార్కు చెందిన సంజీవ్ కుమార్ యాదవ్కు ఆ కుటుంబంతో పరిచయం ఏర్పడింది.
మక్సూద్ భార్య నిషా అక్క కూతురు రఫీకా (31)తో పరిచయం ఏర్పడింది. అప్పటికే భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న రఫీకాతో సహజీవనం చేశాడు.
ఇదే సమయంలో రిఫీకా కుమార్తెతో కూడా నిందితుడు చనువుగా ఉండడాన్ని రఫీకా గమనించి సంజయ్ను నిలదీసింది. ఈ నేపథ్యంలో రఫీకాను రైల్లోంచి తోసేసి అడ్డుతొలగించుకున్నాడు.
మక్సూద్ భార్య నిషా రఫికా గురించి సంజీవ్ని నిలదీసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పింది. దీంతో మక్సూద్ కుటుంబాన్ని కూడా హతమార్చాలని సంజీవ్ టార్గెట్ పెట్టుకున్నాడు.
మే 20వ తేదీన మక్సూద్ మొదటి కుమారుడైన షాబాజ్ పుట్టిన రోజున మక్సూద్ కుటుంబం తయారు చేసుకున్న భోజనంలో నిద్రమాత్రలు కలిపాడు.
వారంతా నిద్రలోకి జారుకున్నాక అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య వరకు మత్తులో ఉన్న ఎండీ మక్సూద్(50), ఆయన భార్య నిషా(45), కుమార్తె బుస్ర (20), బుస్ర కుమారుడు(3), షాబాద్(22), సోహైల్(20), బిహార్కు చెందిన కార్మికులు శ్యామ్(22), శ్రీరామ్(20), వరంగల్ వాసి షకీల్ ను గోదాము పక్కనే ఉన్న బావిలో పడేసి ఇంటికెళ్లి పోయాడు.