– సీఐటీయూ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నాగరాజు గోపాల్
– సీఐటీయూను గెలిపించండి
ఇదే నిజం, మంచిర్యాల జిల్లా ప్రతినిధి: సింగరేణి సంస్థల్లో జరగబోతున్న గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలలో నిజాయతీకి నిలువుటద్దంగా నిలుస్తున్న సీఐటీయూ సంఘాన్ని గెలిపించాలని కార్మికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతామని సీఐటీయూ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నాగరాజు గోపాల్ తెలిపారు. ఆదివారం రామకృష్ణాపూర్ సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నాగరాజు గోపాల్ మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుగా కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సంఘాలు కేవలం పైరవీలకు పరిమితమై తప్పుడు ఒప్పందాలు చేసుకొని కార్మిక వర్గానికి తీరని ద్రోహాన్ని తలపెట్టాయన్నారు. కార్మికుల మీద తీవ్రమైన పని భారం మానసిక వేధింపులు అధికమయ్యాయని కనీసం కార్మికులు వాడే బూట్లు సైతం నాణ్యత లేకుండా పోయాయని ఆరోపించారు. ఉత్పత్తికి అవసరమైన డ్రిల్ రాడ్స్, విల్ బిట్స్ సేఫ్టీ కి అవసరమైన ప్రాప్స్ రూప్ బోల్టులు బేరింగ్ ప్లేట్స్ అన్నీ కూడా కమీషన్లకు కక్కుర్తి పడి నాసిరకం పనిముట్లను సరఫరా చేస్తూ కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. సొంత ఇంటి కల నెరవేరలేదని, సరైన వైద్యం అందడం లేదని ఆయన పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తుంటే గెలిచిన సంఘాలు వంతు పాడుతున్నాయని ధ్వజమెత్తారు. ఒక్కసారి సీఐటీయూ లాంటి సంఘాన్ని కార్మికులు గెలిపించుకుంటే న్యాయబద్ధమైన హక్కుల సాధన కోసం నిరంతరాయంగా పోరాడుతామని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఏరియా అధ్యక్షుడు సాంబార్ వెంకటస్వామి, కార్యదర్శి అల్లి రాజేందర్, ఉపాధ్యక్షులు ఐలయ్య, సంజీవ్, ఫిట్ కార్యదర్శులు జడల ప్రవీణ్, సంఖ్య వెంకటేష్, ఆగిందాల శ్రీనివాస్, మేడి రాజమల్లు, లింగాల రమేష్, నాగవెల్లి శ్రీధర్, కే చైతన్య రెడ్డి , భరత్, వేణుగోపాల్, దొండ నవీన్, ఏ రాజ్ కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.