– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
– రాష్ట్ర అప్పులపై శ్వేతపత్రం విడుదల
ఇదే నిజం, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో చర్చ ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేత పత్రాన్ని విడుదల చేసి ప్రసంగించారు. 42 పేజీల శ్వేత పత్రాన్ని సభ్యులకు అందించారు. రాష్ట్రానికి సంబంధించి మొత్తం అప్పులు రూ.6 లక్షల 71 వేల 757 కోట్లు ఉన్నట్లు శ్వేతపత్రంలో పేర్కొన్నారు.‘ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నాం. గత ప్రభుత్వం వనరులను సక్రమంగా ఉపయోగించలేదు. రోజూవారీ ఖర్చులకూ ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తాం. సవాళ్లు అధిగమించే దిశలో శ్వేతపత్రం మొదటి అడుగు’అని భట్టి అన్నారు. అంతకుముందు సమావేశాలు ప్రారంభం కాగానే.. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా అక్బరుద్దీన్, సీపీఐ శాసనసభా పక్ష నేతగా కూనంనేని సాంబశివరావు పేర్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
42 పేజీల పుస్తం ఇచ్చి మాట్లాడమంటే ఎలా?
శ్వేతపత్రం పేరుతో 42 పేజీల పుస్తకం ఇచ్చి వెంటనే మాట్లాడాలంటే ఎలా..? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. నివేదికను చదివే సమయం కూడా తమకు ఇవ్వలేదని.. ముందు రోజే డాక్యుమెంట్ ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. ప్రభుత్వ సమాధానం సంతృప్తిగా లేకపోతే నిరసన చేపట్టే అవకాశం తమకు ఉందని తెలిపారు. సభను హుందాగా నడిపేందుకు బీఆర్ఎస్ పూర్తిగా సహకరిస్తుందని వెల్లడించారు. అనంతరం సభను స్పీకర్ అరగంట పాటు వాయిదా వేశారు.