– కాంట్రవర్సీకి కేరాఫ్గా మారిన ఐఏఎస్
– సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్
– నిత్యం వార్తల్లోనే..
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: చాలా కీలక పోస్టుల్లో ఉన్న ఐఏఎస్ అధికారులు సైతం సామాన్య ప్రజలకు పెద్దగా తెలియదు. అయితే సీనియర్ ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి మాత్రం ఏ పోస్టులో ఉన్నా నిత్యం గతంలో ఆమె వరంగల్ జిల్లాలో కలెక్టర్ గా పనిచేసినప్పుడు సైతం నిత్యం వార్తల్లో నిలిచేవారు. ఇక జనంలో నానుతుంటారు. దీంతో అసలు ఆమ్రపాలి ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటన్న ఆసక్తి అందరిలోనూ నెలకొన్నది.
ఆమ్రపాలి నేపథ్యం ఇదీ..
ఆమెది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా. తండ్రి కాటా వెంకటరెడ్డి, తల్లి పద్మావతి ఎన్ అగ్రహారానికి చెందిన వారు. తర్వాత ఉద్యోగం నిమిత్తం విశాఖపట్నం వెళ్లారు. వెంకటరెడ్డి ఆంధ్రాయూనివర్శిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్గా పని చేశారు. వెంకటరెడ్డి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరి పెద్ద కూతురు ఆమ్రపాలి. ఈమె 1982 నవంబర్ 4వ తేదీన విశాఖపట్నంలో జన్మించారు. విశాఖపట్నంలోని సాయి సత్య మందిర్ స్కూల్లోనే స్కూల్ విధ్యాభ్యాసం జరిగింది. తర్వాత ఆమె చెన్నై ఐఐటీ మద్రాస్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఐఐఎమ్ బెంగళూరునుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరంగల్ జిల్లా కలెక్టర్గా పని చేసి సెన్సేషనల్, డైనమిక్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం.. ఆమె డ్రెస్సింగ్ కొన్ని సార్లు వివాదాస్పదం అయ్యాయి. అధికారిగా ఆమె డైనమిక్ గా దూసుకుపోయినప్పటికీ హుందాగా వ్యవహరించదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక అప్పట్లో ఆమె ఏ కలెక్టర్ కు లేనంత క్రేజ్ సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువ. తన ఆఫీసులో దెయ్యం ఉందంటూ ప్రెస్ మీట్ పెట్టడం.. అటవీ ప్రాంతంలో మోడ్రన్ డ్రెస్ లో ట్రెక్కింగ్ చేయడం వంటి అంశాలు ఆమెకు కొంత మేర నెగిటివిటి తీసుకొచ్చాయి.
చిన్నవయసులోనే ఐఏఎస్
ఆమ్రపాలి పబ్లిక్ సర్వీసుల మీద ప్రేమతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాశారు. అందులో ఆల్ ఇండియా 39వ ర్యాంకు తెచ్చుకున్నారు. చిన్న వయసులోనే ఐఏఎస్ అయి రికార్డు సృష్టించారు. ట్రైనింగ్ తర్వాత వికారాబాద్ జిల్లాకు సబ్కలెక్టర్ అయ్యారు. ఆ తర్వాత స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో పని చేశారు. 2015లో రంగారెడ్డి జిల్లాకు జాయింట్ కలెక్టర్గా పని చేశారు. 2016లో కొత్తగా జిల్లాలు ఏర్పడటంతో ఆమెకు పదోన్నతి లభించింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల కలెక్టర్గా పని చేశారు. 2020లో ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా ఎంపిక చేస్తూ వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆమ్రపాలి మళ్లీ తెలంగాణకు వచ్చేశారు. ఇటీవల హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు.