హైదరాబాద్: మంచి టూరిస్ట్ స్పాట్స్గా ఉండి పర్యాటకులు వీకెండ్లో వెళ్లి వచ్చేలా ప్లాన్ చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు.
లాక్డౌన్లో టూరిజం స్పాట్లను మూసేసిన ప్రభుత్వం, తాజాగా వాటిని ఓపెన్ చేసేందుకు అనుమతులిచ్చింది.
దీంతో టూరిజంపై ఆసక్తి చూపేవారు, పర్యాటకులు ఎక్కడికి వెళ్లాలో ప్రణాళికలు వేసుకొంటున్నారు.
దట్టమైన అభయారణ్యాల్లో పర్యటించడం, ప్రకృతిని ఆస్వాదించడం, వణ్యప్రాణులు ఉండే అభయారణ్యాలకు వెళ్లడంపై ఆసక్తి ఉన్నవారు వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.
హైదరాబాద్ చుట్టుపక్కల చెప్పుకోదగ్గ వైల్డ్ లైఫ్ సాంచరీస్ ఉన్నాయి.
1. తాడోబా నేషనల్ పార్క్
దేశంలోని అతిపెద్ద వన్యప్రాణుల అభయారణ్యాలలో ఇది ఒకటి. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉంది. జిల్లా కేంద్రం నుంచి సుమారు 29 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇందులో 88 పులులు ఉన్నయి. చిరుతపులులు, బెంగాల్ టైగర్, ఎలుగుబంట్లు, నీల్గాయ్, మచ్చల జింకలు, అడవి పిల్లులు, సాంబార్, ఇండియన్ సివెట్, చారల హైనా వంటి ఎన్నో అడవి జంతువులకు ఈ పార్క్ నిలయం.
మార్చి నుంచి మే మధ్య ఇక్కడికి వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు. ఇది హైదరాబాద్ నుంచి 412 కి.మీ. దూరంలో ఉంటుంది.
2. నాగార్జున సాగర్ అభయారణ్యం
నాగార్జున సాగర్-శ్రీశైలం అభయారణ్యం భారతదేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం. ఇది నాగార్జున సాగర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొత్తం 3568 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
శ్రీశైలం రిజర్వాయర్, నాగార్జున సాగర్ మధ్య ఉన్న ఈ టూరిస్ట్ స్పాట్ను 1973లో అభయారణ్యంగా, కొన్నేళ్ల తరువాత పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తించారు.
పాంథర్స్, మచ్చల జింకలు, పులులు, బ్లాక్ బక్, సాంబార్లు, చౌసింగ్ నీల్గై, మగ్గర్ మొసళ్ళు, తోడేళ్ళు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు వంటి ఎన్నో జంతువులు ఇక్కడ కనిపిస్తాయి.
ఈ పార్క్కు కండ్లకుంట, వట్వర్ల పల్లె, మన్ననూర్ వంటి గేట్వేలు ఉన్నాయి. హైదరాబాద్- శ్రీశైలం హైవే నుంచి ఈ అడవిలో జీప్ సఫారీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందుబాటులో ఉంచింది.
ప్రైవేటు వాహనాలను లోపలికి అనుమతించరు. మల్లెక తీర్థం జలపాతం, ఉమా మహేశ్వరం, సలేశ్వరం వంటి అనేక పర్యాటక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఇది హైదరాబాద్ నుంచి 173 కి.మీ. దూరంలో ఉంది.
3. పోచారం డ్యామ్, వన్యప్రాణుల అభయారణ్యం
ఇది మెదక్ జిల్లాలోని పోచారం గ్రామం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వన్యప్రాణుల అభయారణ్యం 130 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.
ఈ అడవిలో అప్పట్లో నిజాం పాలకులు వేటాడేవారు. వర్షాకాలంలో ప్రవహించే మంజీరా నది నీటితో పోచారం రిజర్వాయర్ ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.
చిరుత పులులు, ఎలుగుబంట్లు, అడవి పందులు, పాంథర్, నీల్గాయ్, చింకారా, హైనా, నక్కలు వంటి జంతువులు, అనేక రకాల పక్షులు ఇక్కడ కనిపిస్తాయి. మొసళ్ళు, నీటి తాబేళ్లు, మార్ష్, కోబ్రా వంటి జీవజాతులు నివసిస్తున్నాయి. ఇది హైదరాబాద్ నుంచి 109 కి.మీ. దూరంలో ఉంది.
4. రోళ్లపాడు వన్యప్రాణుల అభయారణ్యం
ఇది కర్నూలు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రేట్ ఇండియన్ బాస్టర్డ్ వంటి అరుదైన పక్షి జాతులు ఇక్కడ కనిపిస్తాయి.
ఇక్కడికి పెద్ద సంఖ్యలో వలస పక్షులు వస్తాయి. ఈ అభయారణ్యం రోళ్లపాడు గ్రామానికి 4.5 కి.మీ. దూరంలో ఉంటుంది.
గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ జాతి పక్షులు అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్నాయి. వాటిని సంరక్షించడానికి 1988లో ఈ అభయారణ్యాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఇది హైదరాబాద్ నుంచి 255 కి.మీ. దూరంలో ఉంది.
5. ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం
దక్షిణ భారతదేశంలోని పురాతన అభయారణ్యాలలో ఇది ఒకటి. దీన్ని 1952లో హైదరాబాద్ నిజాం ప్రభుత్వం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు.
ఇది ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉంది. సమ్మక్క-సారలమ్మ గుడి ఈ అభయారణ్యంలోనే ఉంది.
మొత్తం 806 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడ చిరుతపులులు, పులులు, నక్కలు, ఎలుగుబంట్లు, పాంథర్స్, తోడేళ్ళు, చౌసింగ్, అడవి కుక్కలు, బ్లాక్ బక్స్, మచ్చల జింక, నాలుగు కొమ్ముల జింకలు, సాంబార్, నీల్గాయ్, గౌర్, పెద్ద ఉడతలు వంటి అనేక జంతువులు, పక్షులు నివసిస్తున్నాయి.
అక్టోబర్, మే మధ్యలో ఇక్కడ పర్యటించవచ్చు. హైదరాబాద్ నుండి 253 కి.మీ. దూరంలో ఉంది.
6. పాకాల జలపాతం, అభయారణ్యం
పాకాల జలపాతం వరంగల్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని క్రీ.శ 1213లో గణపతి దేవుడు నిర్మించారు.
ఈ సరస్సు 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. జలపాతం దగ్గరే 839 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వన్యప్రాణుల అభయారణ్యం ఉంది.
ఇక్కడ నివసించే వివిధ రకాల జీవజాతులు, సీనరీలు ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. ఎలుగుబంట్లు, పులులు, చిరుతపులులు, పాంథర్స్, తోడేళ్ళు, హైనాలు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు, నక్కలు, నీల్గాయ్, లంగూర్, కోబ్రా, కొండచిలువలు, మొసళ్ళు, వివిధ రకాల సరీసృపాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఇది హైదరాబాద్ నుంచి 130 కి.మీ. దూరంలో ఉంది.
7. కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం
ఇది గోదావరి నది ఒడ్డున విస్తరించి ఉంది. కిన్నెరసాని నది పేరుతో ఈ అభయారణ్యానికి కిన్నెరసాని అని పెట్టారు. ఈ నది అడవి మధ్య నుంచి ప్రవహించి గోదావరిలో కలుస్తుంది.
ఇది 635.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. కైక్ సాంబార్, అడవి పందులు, గౌర్స్, హైనా, చింకారా, నక్కలు, పులులు, బ్లాక్ బక్స్ వంటి అడవి జంతువులు ఇక్కడ నివసిస్తాయి. అడవి కోడి, పార్ట్రిడ్జ్, టీల్స్, పిట్టలు, పావురాలు, స్పూన్బిల్స్, నుక్తాస్, పీఫౌల్ వంటి అరుదైన పక్షిజాతులకు ఈ అభయారణ్యం నిలయం.
టూరిస్టులు అడవి అందాలతో పాటు డీర్ పార్క్, కిన్నెరసాని డ్యామ్, రిజర్వాయర్లను చూసి రావచ్చు. ఇది హైదరాబాద్ నుంచి 297 కి.మీ. దూరంలో ఉంది.