కరోనాపై పోరాటంలో భారత్కు అగ్రరాజ్యం అమెరికా తనవంతు సహకారం అందిస్తోంది. తాజాగా మన దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు అదనంగా 25 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది.
కరోనా మహమ్మారిపై పోరుతో భారత్కు ఎల్లప్పుడూ బాసటగా ఉంటామని అమెరికా స్పష్టం చేసింది.
రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్తో భేటీ అయ్యారు.
అనంతరం ఇరువురు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం అదనంగా 25 మిలియన్ డాలర్ల సాయాన్ని అమెరికా ప్రకటించింది.
ఈ సందర్భంగా ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ.. కరోనాపై పోరాటానికి ఇప్పటివరకు 200 మిలియన్ డాలర్లకు పైగా సాయం ఇండియాకు అందించామని, తాజాగా మరో 25 మిలియన్ల డాలర్లు సాయాన్ని అదనంగా ప్రకటించడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.
వ్యాక్సిన్ సరఫరా లాజిస్టిక్స్ను బలోపేతం చేసుకొనేందుకు, తప్పుడు సమాచారం, వ్యాక్సిన్ సంకోచం వంటి సమస్యల్ని అధిగమించడంతో పాటు మరింత మంది ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు ఈ సాయం ఇస్తున్నట్టు తెలిపారు.
రెండు దేశాల్లోనూ కరోనా తీవ్రత అధికంగా ఉందని, దీన్ని అంతం చేసేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు.
కరోనా మహమ్మారి వ్యాప్తిచెందిన తొలినాళ్లలో భారత్ చేసిన సహకారాన్ని అమెరికా ఎన్నటికీ మరువబోదన్నారు.
అనంతరం జైశంకర్ మాట్లాడుతూ.. తక్కువ ధరలకే ప్రపంచంలో టీకాలు అందుబాటులో ఉంచే అంశంపై అమెరికాతో చర్చించినట్టు తెలిపారు.
భారతీయ ప్రయాణికుల పట్ల అమెరికా సానుకూల ధోరణితో వ్యవహరిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.
వ్యాక్సిన్ ఉత్పత్తి, లభ్యతపై ఇరు దేశాలూ కలిసి పనిచేస్తాయని జైశంకర్ ప్రకటించారు.