Smart TV Sales hike in festival season : స్మార్ట్ టీవీలకు పండుగ సీజన్ జోరు..
గృహోపకరణాలు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో ధంతేరాస్ ఉత్సాహం
గృహోపకరణాలు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో ధంతేరాస్ (ధనత్రయోదశి) ఉత్సాహం తొణికిసలాడింది.
కరోనా కారణంగా గతేడాది అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది విక్రయాల్లో 45 శాతం పెరుగుదల చూశామన్న అభిప్రాయాలు వ్యాపారుల్లో వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా స్మార్ట్ టీవీలకు కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ కనిపిస్తున్నదని ప్రముఖ సంస్థలు చెప్తున్నాయి.
భారీ స్క్రీన్ టెలివిజన్లు, ప్రీమియం శ్రేణి ఉత్పత్తులకు ఆదరణ ఆకర్షణీయంగా ఉందంటున్నాయి.
సోనీ, పానసోనిక్, సామ్సంగ్, ఎల్జీ, గోద్రెజ్ కంపెనీలు.. నిరుడుతో చూస్తే ఈ ఏడాది ధంతేరాస్కు బాగా అమ్మకాలు జరిగినట్లు తెలిపాయి.
పండుగ సీజన్ జోరు
ఈ పండుగ సీజన్లో కన్జ్యూమర్ సెంటిమెంట్ మునుపెన్నడూ లేనివిధంగా బలపడిందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
భారీ ఆఫర్లతో ఈ-కామర్స్ సంస్థల అమ్మకాలు జోరుగా సాగుతుండటం కూడా కలిసొచ్చిందని ఆయా సంస్థలు వివరిస్తున్నాయి.
ఆన్లైన్ షాపింగ్తో చిన్నతరహా, గ్రామీణ మార్కెట్ల నుంచీ ఆదాయం వస్తున్నదంటున్నాయి.
‘గత రెండు రోజుల నుంచి పెద్ద ఎత్తున అమ్మకాల్ని చూస్తున్నాం.
మంగళవారం ధంతేరాస్ సందర్భంగా భారీ విక్రయాలు జరిగాయి’ అని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లియెన్సెస్ తయారీదారుల సంఘం అధ్యక్షుడు ఎరిక్ బ్రాగంజా బుధవారం తెలిపారు.
4కే ఆండ్రాయిడ్ టీవీలు, ఏసీలు, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, మైక్రోవేవ్ అవెన్లకు డిమాండ్ బాగా ఉందన్నారు.