Telangana CS:తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ ఆఫీసర్ శాంతి కుమారి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి 2025, ఏప్రిల్ వరకు కొనసాగనున్నారు. 1989 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి శాంతి కుమారి.. గతంలో సీఎం కార్యాలయంలో పని చేశారుతెలంగాణ తొలి మహిళా సీఎస్గా శాంతి కుమారి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమె అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గతంలో వైద్యారోగ్య శాఖ బాధ్యతలను నిర్వర్తించారు. సీఎంవోలో స్పెషల్ ఛేజింగ్ సెల్ బాధ్యతలను కూడా నిర్వహించారు. కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో మెదక్ కలెక్టర్గా కూడా శాంతి కుమారి సేవలందించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను తక్షణమే విధుల నుంచి విడుదల (రిలీవ్) చేయాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. సోమేశ్కుమార్ ఈనెల 12లోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల విభాగం (డీవోపీటీ) ఉత్తర్వులు జారీచేసింది. సోమేశ్కుమార్ ఏపీ క్యాడర్కు చెందిన అధికారేనని తెలంగాణ హైకోర్టు మంగళవారం స్పష్టం చేయడంతో వెంటనే ఆయనను ఏపీకి బదిలీ చేస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది. మూడేండ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సోమేశ్కుమార్ ఈ ఏడాది డిసెంబర్లో పదవీ విరమణ చేయాల్సి ఉన్నది. ఆయన తెలంగాణ క్యాడర్లో కొనసాగడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన కేసుపై రాష్ట్ర హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.
సోమేశ్కుమార్ ఏపీ క్యాడర్కే చెందుతారని తేల్చిచెప్పింది. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ చేసిన సిఫారసులను హైకోర్టు సమర్ధించింది. ఆ సిఫారసుల ప్రకారం సోమేశ్కుమార్ ఏపీ క్యాడర్ అధికారేనని, దీనికి వ్యతిరేకంగా గతంలో కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన తీర్పు చెల్లదని తేల్చింది. క్యాట్ తన పరిధిని అతిక్రమించి వ్యవహరించిందని తప్పుపడుతూ.. క్యాడర్ను నియంత్రించే అధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సూరేపల్లి నందతో కూడిన ధర్మాసనం 89 పేజీల తీర్పును వెలువరించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర సర్వీసు అధికారుల విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యూష్ సిన్హా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఆ కమిటీలో ఉమ్మడి ఏపీ చివరి ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సభ్యుడిగా ఉండటాన్ని సోమేశ్కుమార్ తప్పుపట్టడాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని, అందుకోసం తీర్పు అమలుపై 3 వారాలపాటు స్టే విధించాలని సోమేశ్కుమార్ తరఫు న్యాయవాది కోరారు. ఆ వినతిని కూడా హైకోర్టు తిరస్కరించింది.