Modi Tour: నాలుగు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బయల్దేరారు. మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన మోదీ.. బుధవారం నుంచి అమెరికాలో అధికారిక పర్యటన చేయనున్నారు. ఈ పర్యటన ఇండో – అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని.. బయల్దేరే ముందు ప్రధాని తెలిపారు. ఈ పర్యటనలో మోదీ తీరిక లేకుండా గడపనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో భేటీ కానున్నారు. ఈ నాలుగు రోజుల పర్యటనలో ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ సహా దాదాపు రెండు డజన్ల మందితో సమావేశం కానున్నారు.
పర్యటన విశేషాలు
అమెరికా పర్యటనలో భాగంగా తొలుత మోదీ న్యూయార్క్ నగరంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బైడెన్ సహా ఇతర అమెరికన్ నాయకులతో జరిగే చర్చలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. దీంతో పాటు జీ 20, క్వాడ్, ఇండో – పసిఫిక్ ఎకానమిక్ ఫ్రేమ్వర్క్ వంటి సదస్సుల్లో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. జూన్ 21 బుధవారం రోజున ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా వేడుకల్లో ప్రధాని పాల్గొననున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలన్న భారత ప్రతిపాదనకు ఆమోదం లభించిన చోట యోగా వేడుకల్లో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందని మోదీ వెల్లడించారు.
బైడెన్తో భేటీ
న్యూయార్క్ తర్వాత నేరుగా ప్రధాని వాషింగ్టన్ వెళ్లనున్నారు. వాణిజ్యం, సాంకేతికత, సృజనాత్మకత వంటి పలు రంగాల్లో ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. రక్షణ రంగంలో ఇరు దేశాలు పరస్పర సహకారం కోసం ఈ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. బైడెన్తో చర్చల్లో భాగంగా ఉమ్మడిగా రక్షణ ఉత్పత్తుల తయారీ, అభివృద్ధికి రోడ్డు మ్యాప్ రూపొందిచాలని భారత్ భావిస్తోంది. ఈ పర్యటనలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు.. శ్వేతసౌధంలో మోదీకి విందు ఇవ్వనున్నారు. తర్వాత
అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. గతంలో ట్రంప్ హయాంలో అమెరికన్ కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడిన మోదీ.. ఈ ఘనత సాధించిన తొలి భారత ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఈ పర్యటన అనంతరం మోదీ ఈజిప్టులో పర్యటించనున్నారు. జూన్ 25న భారత్ చేరుకోనున్నారు.
ప్రముఖులతో సమావేశాలు
ప్రపంచంలోనే అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్తో ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ట్విటర్ను హస్తగతం చేసుకున్న తర్వాత తొలిసారి వీరు ఇద్దరు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తర్వాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, రచయిత, సైన్స్ కమ్యూనికేటర్ నీల్ డి గ్రాస్సే టైసన్తో ప్రధాని సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ బ్యాంక్ మాజీ చీఫ్ ఎకనమిస్ట్ పాల్ మైకెల్ రోమర్తోనూ మోదీ భేటీ కానున్నారు. ఇదే పర్యటనలో భారత మూలాలున్న సింగర్, 2022 గ్రామీ అవార్డు విన్నర్ ఫాలూ షాతో మోదీ సమావేశం కానున్నారు. వీరితో పాటు చాలా మంది అమెరికాలోని రక్షణ శాఖలో పనిచేసిన మాజీ అధికారులను కలవనున్నారు.