vanama: ఇదేనిజం, నేషనల్ బ్యూరో: తెలంగాణలోని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అనర్హతపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. 15 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ గత నెల 25న తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తప్పుడు వివరాలతో వాస్తవాలను దాచి ఎన్నికల అఫిడవిట్ సమర్పించినందుకు శిక్షగా ఆయనకు రూ.5 లక్షల జరిమానా విధించింది.
దీంతోపాటు పిటిషనర్ జలగం వెంకట్రావు ఖర్చులను కూడా చెల్లించాలని ఆదేశించింది. జలగం వెంకట్రావు 2018 డిసెంబరు 12 నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యేగా కొనసాగుతారని ప్రకటించింది. 2018 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు (అనంతర కాలంలో ఆయన భారాసలో చేరారు) ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ తెరాస తరఫున పోటీ చేసిన జలగం వెంకట్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. వనమా ఎన్నిక చెల్లదంటూ తీర్పు చెప్పింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.