– రూ.2.5 కోట్లు విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటన
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: గాజాలోని అల్ అహ్లి ఆస్పత్రిపై రాకెట్ దాడి జరగడంపై నోబెల్ పురస్కార గ్రహీత మలాలా యూసఫ్జాయ్ విచారం వ్యక్తం చేశారు. ఈ సంక్షోభ వేళ పాలస్తీనా ప్రజలకు సాయం చేస్తున్న మూడు స్వచ్ఛందసంస్థలకు తన వంతుగా 3 లక్షల డాలర్లు (రూ.2.5 కోట్లు) విరాళం అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియోను ఆమె విడుదల చేశారు. ‘గాజాలోని అల్ – అహ్లి ఆసుపత్రిపై జరిగిన బాంబు దాడిని చూసి భయపడ్డా. ఈ చర్యను నిస్సందేహంగా ఖండిస్తున్నా. ఇజ్రాయెల్, పాలస్తీనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనాలని కోరుకొంటున్న ప్రజలతో నేనూ గొంతు కలుపుతున్నా. సామూహిక శిక్ష పరిష్కారం కాదు. గాజా జనాభాలో సగం మంది 18 ఏళ్లలోపు వయసువారే. వారు తమ జీవితాంతం బాంబు దాడుల మధ్య బతకకూడదు’అని అందులో పేర్కొన్నారు.