– ఎంఐఎం సత్తా ఏంటో చూపిస్తాం
– అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మద్దతివ్వండి
– రేవంత్రెడ్డి కాంగ్రెస్ పతనానికి పనిచేస్తున్నారు
– ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి దమ్ముంటే హైదరాబాద్లో పోటీచేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్, ఎంఐఎం మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. ఎంఐఎం డబ్బులు తీసుకుని బీజేపీ కోసం పనిచేస్తున్నదని, కాంగ్రెస్ను ఓడించడానికి దేశవ్యాప్తంగా పోటీచేస్తున్నదని రెండు రోజుల క్రితం రాహుల్గాంధీ ఆరోపించారు. అందుకు అసదుద్దీన్ స్పందిస్తూ తాము యూపీఏకు మద్దతు ఇవ్వడానికి ఎంత డబ్బు ఇచ్చారని ప్రశ్నించారు. 2008లో జరిగిన న్యూక్లియర్ డీల్లో మద్దతు ఇచ్చినందుకు ఎన్ని డబ్బులు తీసుకున్నా? రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ముఖర్జీకి మద్దతు ఇచ్చినందుకు ఎంతిచ్చారని రాహుల్గాంధీని ప్రశ్నించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఒవైసీ విలేకరులతో మాట్లాడుతూ రాహుల్గాంధీ హైదరాబాద్లో పోటీచేయాలని, అప్పుడు ఎంఐఎం సత్తా ఏంటో చూపిస్తామన్నారు. తమని బీ టీమ్ అని పిలిస్తే.. మరి మీరు ఎవరి జట్టని ప్రశ్నించారు. రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు సీఎం కేసీఆర్కు మద్దతివ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పతనానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పనిచేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.