– వరుసగా ఐదోసారి చోటు దక్కించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. 2023 ఏడాదికి ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో ఆమెకు వరుసగా ఐదోసారి చోటు దక్కింది. భారత్ నుంచి మొత్తం నలుగురు మహిళలకు చోటు దక్కగా.. వారిలో నిర్మలా సీతారామన్ తొలి స్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్త జాబితాలో ఆమె 32వ స్థానంలో ఉన్నారు. గతేడాది 36వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. నిర్మలా సీతారామన్ తర్వాత భారత్ నుంచి హెచ్సీఎల్ కార్పొరేషన్ చైర్పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా (60వ స్థానం), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్) చైర్పర్సన్ సోమా మోండల్ (70వ స్థానం), బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందర్ షా(76వ స్థానం)కు వరుసగా ఈ ఏడాది కూడా జాబితాలో చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా శక్తిమంతమైన మహిళల జాబితాలో యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ దెర్ లెయెన్ తొలి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిపతి క్రిస్టినా లగార్డ్, మూడో స్థానంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఉన్నారు. నాలుగో స్థానంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఐదు స్థానంలో అమెరికా గాయని టేలర్ స్విప్ట్ చోటు దక్కించుకున్నారు.