- గవర్నర్ కు రాజీనామా లేఖ
- వెంటనే ఆమోదించిన తమిళి సై
- నేడు సభ్యులు కూడా రిజైన్ చేసే చాన్స్
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ వెంటనే రిజైన్ చేశారు. గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కు ఆయన రాజీనామా లేఖను సమర్పించగా ఆమె వెంటనే ఆమోదించారు. నేడు టీఎస్ పీఎస్సీ సభ్యులు కూడా రాజీనామా చేసే అశకాశం ఉందని సమాచారం. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే టీఎస్ పీఎస్సీని ప్రక్షాలన చేస్తారన్న వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకున్నది. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన కమిషన్ జారీచేసిన గ్రూప్-1, అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రశ్నపత్రాలు లీకవడం అప్పట్లో కలకలం సృష్టించింది. టీఎస్పీఎస్సీలో పనిచేసిన అసిస్టెంట్ సెక్షన్ అధికారి ప్రవీణ్కుమార్, నెట్వర్క్ నిపుణుడు రాజశేఖర్రెడ్డి పలు పరీక్షల ప్రశ్న పత్రాలు తస్కరించి, బయటి వ్యక్తులకు విక్రయించినట్టు పోలీసు విచారణలో వెల్లడైంది. ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం ఈ ఏడాది జూన్లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో లోపాలు చోటుచేసుకున్నాయని, విద్యార్థుల బయోమెట్రిక్ తీసుకోలేదంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. లోపాలు నిజమేనని పేర్కొంటూ న్యాయస్థానం ప్రిలిమినరీ పరీక్షను రద్దుచేయడంతో కమిషన్పై నిరుద్యోగుల్లో ఆగ్రహం పెల్లుబికింది. టీఎస్పీఎస్సీ బోర్డును రద్దుచేసిన తరువాతే మిగతా పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్ వారి నుంచి వచ్చింది.
అప్పట్లోనే రాజీనామా చేయాలని భావించినా…
ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చాక కమిషన్ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన అంశంలో ఛైర్మన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆయన్ను తొలగించడంతోపాటు బోర్డును ప్రక్షాళన చేయాలని రాజకీయ పార్టీలు, నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేయాలని ఛైర్మన్ బి.జనార్దన్రెడ్డి నిర్ణయించుకున్నారు. అయితే ఆయన రాజీనామా నిర్ణయాన్ని అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. కమిషన్లో జరిగిన పొరపాట్లు సరిదిద్దాలని, సంస్కరణలు చేపట్టి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించడంతో ఆయన ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. తాజాగా ఆయన రాజీనామా చేయడం గమనార్హం.