– ఎంఎస్ బాబు నిర్ణయం సరికాదు
– ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి
– మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి
ఇదే నిజం, ఏపీ బ్యూరో: షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన తాము కూడా పార్టీ మారాలా? అని మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. సీఎం జగన్కు ఎవరు వ్యతిరేకంగా పనిచేసినా తాము ప్రతిపక్షంగానే చూస్తామని చెప్పారు. గురువారం చిత్తూరు జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పెద్దిరెడ్డి మాట్లాడారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు నిర్ణయం సరికాదని చెప్పారు. ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. జగన్పై వైసీపీకి చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు విమర్శలు చేయడాన్ని పెద్దిరెడ్డి ఖండించారు. జెడ్పీటీసీగా గెలవలేని వ్యక్తిని ఎమ్మెల్యే చేశామన్నది గుర్తించాలన్నారు. పూతలపట్టులో పార్టీ ఇన్చార్జ్ను మార్చాలన్న ముఖ్యమంత్రి నిర్ణయంపై విమర్శలు చేయడం ఎంఎస్ బాబుకు తగదన్నారు.