హైదరాబాద్: మన శరీరం రోగాల బారీనుంచి కాపాడుకోవాలంటే రోగనిరోధక శక్తి అధికంగా ఉండాలి. కానీ మనకు తెలిసో తెలియకో ఆ శక్తిని తగ్గించుకుంటాం.
సో.. మన వ్యాధినిరోధక శక్తిని శక్తిమంతంగా ఉంచుకునేందుకు మన నిత్య అలవాట్లను ఓ సారి రివైజ్ చేసుకుంటే సరిపోతుందని ఆహార నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఒత్తిడిని తగ్గించుకోండి
ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి గురికావడం మానసిక అనారోగ్యానికి దారితీయొచ్చు. ఒత్తిడి వల్ల రక్తపోటు పెరుగుతుంది. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
జీర్ణక్రియపై కూడా ప్రభావం పడుతుంది. ఫలితంగా శరీరంలో హార్మోన్ల సమతుల్యం దెబ్బతింటుంది. రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది.
జంక్ఫుడ్కు బైబై
యువత, పిల్లలు ఎక్కువగా జంక్ఫుడ్ తింటుంటారు. వారాంతం వస్తే చాలు, ఇంటి వంట పక్కన పెట్టి.. పిజ్జా, బర్గర్లు కావాలంటూ మారం చేస్తారు. తల్లిదండ్రులు కాదనలేక కొనిస్తుంటారు.
కానీ, ఈ జంక్ఫుడ్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వీటి వల్ల శరీరంలో కొవ్వు పెరిగి, రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. దీంతో సులువుగా వ్యాధులు శరీరంలోకి వచ్చి చేరుతాయి. కాబట్టి ఈ జంక్ఫుడ్కు వీలైనంత దూరంగా ఉండండి.
కాఫీ, టీ మోతాదు మించొద్దు
కాఫీ, టీ తాగడం వల్ల కలిగే లాభనష్టాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. కొన్నిసార్లు అవి తాగడం మంచిదేనంటారు.. కొన్నిసార్లు వాటి వల్ల గుండెసంబధిత వ్యాధులు వచ్చే అవకాశముందంటారు.
వీటి గురించి పక్కన పెడితే.. కాఫీ, టీలో ఉండే కెఫిన్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల నిద్ర సమస్యలు వస్తాయి.
సాధారణంగా నిద్రరాకుండా ఉండటం కోసం కాఫీ, టీలు తాగుతుంటారు. ఇలా అధికంగా తాగడం వల్ల నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి. ఫలితంగా కడుపులో మంటగా ఉండటం, రోగనిరోధకశక్తి తగ్గడం వంటివి జరుగుతాయి.
చక్కెరతో జాగ్రత్త
తీపి అంటే ఎవరికి చేదు చెప్పండి. రోజులో ఏదో రకంగా మనం తీపి పదార్థాలు తింటూ ఉంటాం. కానీ దాన్ని ఇష్టపడే వారు మరింత అధికంగా చక్కెర తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని అందరికీ తెలుసు.
ఇలా అధిక మోతాదులో చక్కెర వినియోగం వల్ల రోగనిరోధక కణాల పని సామర్థ్యం కూడా తగ్గిపోతుందని పరిశోధకులు ఇటీవల చేసిన అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి చక్కెర తీసుకునే సమయంలో మోతాదు మించకుండా చూడండి.
ఉప్పుతో ముప్పు
ఎంత బాగా వండినా.. ఎన్ని మసాలాలు వేసినా వంటలో ఉప్పు లేకపోతే రుచే ఉండదు. ఆహార పదార్థాల్లో దానికి అంత ప్రాధాన్యం ఉంది.
అలా అని అధిక మొత్తంలో ఉప్పును తింటే రక్తపోటు పెరుగుతుందని అందరికి తెలిసిందే. కానీ, దీని వల్ల రోగనిరోధకశక్తి బలహీనపడుతుందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది.
శరీరంలోని అధిక సోడియంను మూత్రపిండాలు వడపోసే సమయంలో డొమినే ఎఫెక్ట్ సంభవిస్తుందని, దీని వల్ల శరీరం బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతుందని పరిశోధకులు తెలిపారు.
అధిక మద్యం హానికరం
నిత్యం మద్యం సేవించేవారిలో కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశంతోపాటు రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు.
మద్యం ఎక్కువగా తాగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని.. తద్వారా మొదట న్యూమోనియా రావడం, అనంతరం శ్వాస తీసుకోవడంలోనూ సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు.
ఈ క్రమంలో కరోనా సోకితే దాని తీవ్రత అధికంగా ఉంటుంది. అందుకే మద్యం సేవించడం తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.
పెంచుకునేందుకు మార్గాలు
* విటమిన్లు, పోషకాలు మెండుగా ఉండే పండ్లు.. కూరగాయాలు ఎక్కువగా తినాలి.
* పీచు పదార్థాలు జీర్ణాశయ పనితీరును మెరుగుపరుస్తాయి. తద్వారా పోషకాలు శరీరంలో చేరి రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
* వ్యాయామం, యోగా వంటివి మానసిక ఒత్తడిని తగ్గిస్తాయి. రోగనిరోధకశక్తిని పెంచుతాయి.
* తరచూ నీరు తాగాలి.
* ఆకు కూరల్లో విటమిన్ ఏ, సీ, కే ఉంటాయి. మెగ్నిషియం, కాల్షియం వంటి పోషకాలుంటాయి. కాబట్టి ఆకుకూరల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి.