తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ):
శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఇతర ఉద్యోగులతో సమానంగా ‘సమాన పనికి-సమాన వేతనం’ వర్తింపజేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
కాంట్రాక్టు ఉద్యోగా?, శాశ్వత ఉద్యోగా? అనే విషయంతో సంబంధం లేకుండా ఒకే పని నిర్వహిస్తున్నప్పుడు సమాన వేతనం పొందేందుకు సదరు ఉద్యోగి అర్హుడని స్పష్టం చేసింది.
అలా చెల్లించకపోతే బలహీనవర్గాల ప్రజలను దోపిడీకి గురిచేయడమేనని చెప్పడానికి న్యాయస్థానం సంకోచించడం లేదని పేర్కొంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.
సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ జగ్జిత్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఈ సందర్భంగా ఉటంకించింది.
ఇతర ఉద్యోగులతో సమానంగా ఒకే తరహా పని పిటిషనర్లు చేస్తున్నందున.. వేతన ప్రయోజనాలు పిటిషనర్లకు కూడా తక్షణం చెల్లించాలని దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి, టీటీడీ ఈవో, గోసంరక్షణశాల డిప్యూటీ డైరెక్టర్ను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ బట్టుదేవానంద్ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
గోసంరక్షణశాలలో కాంట్రాక్టు కార్మికులుగా ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి గతంలో కల్పించిన వేతన ప్రయోజనాలను తమకూ వర్తింపజేయాలని 11 మంది కాంట్రాక్టు కార్మికులు 2011లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
టీటీడీ 2007 నవంబరు 12న చేసిన తీర్మానం మేరకు అప్పటికే 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న 73 మంది ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేసిందని, వారు చేస్తున్న పనులే తామూ చేస్తున్నందున సంబంధిత తీర్మానం తమకు కూడా వర్తింపజేసి కనీసవేతన ప్రయోజనాలు కల్పించాలని కోరారు.
కాగా, టీటీడీ తరఫున న్యాయవాది సుమంత్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు 2010లో అందించామని చెబుతున్న వినతి పత్రం టీటీడీ రికార్డుల్లో లేదన్నారు. 2011 మే 26న టీటీడీ తీర్మానం మేరకు పిటిషనర్లకు ఉపశమనం లభించదన్నారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఒకే తరహా పనులు చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచినందున పిటిషనర్లకు పెంచాలా లేదా అనే విషయం తుది విచారణలో తేల్చాల్సి ఉందన్నారు.
కరోనా ముప్పు తొలిగాక ప్రత్యక్షపద్ధతిలో విచారణ జరుపుతామన్నారు. పిటిషనర్లు గత 15 ఏళ్లుగా ఇతర ఉద్యోగులతో సమానంగా శ్రీవారి పాదాల చెంత సేవలు అందిస్తున్నందున వారికి ఇతర ఉద్యోగలతో సమానంగా కనీస వేతనం చెల్లించాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
కాళేశ్వరం నీటిని విడుదల చేసిన సీఎం కేసిఆర్
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్వీ రమణ