తెలంగాణను టార్గెట్ చేసిన కాంగ్రెస్
– ‘విజయభేరి’పై ఫుల్ ఫోకస్
– హైదరాబాద్కు అతిరథ మహారథులు
– సర్వశక్తులు ఒడ్డుతున్న నేతలు
– ఆశావహులకు టార్గెట్ పెట్టిన పీసీసీ చీఫ్
– నియోజకవర్గం నుంచి 10వేలమందిని తరలించేలా ప్లాన్
– జనసమీకరణ కోసం తీవ్ర ప్రయత్నాలు
– ముఖ్యనేతలు మొత్తం రాష్ట్రంలోనే మకాం
– తెలంగాణలో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ వ్యూహాలు
– ఇచ్చిన పార్టీకి చాన్స్ ఇవ్వాలని జనంలోకి..
– మెనిఫెస్టో మీద తీవ్ర కసరత్తు
– ఐదు గ్యారెంటీలను ప్రకటించనున్న సోనియా గాంధీ
Congress party focus on Telangana:ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: హస్తం పార్టీ తెలంగాణపై మోహరించింది. ఈ దఫా పవర్ మిస్ చేసుకోవద్దని గట్టిగా స్కెచ్లు వేస్తున్నది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ముఖ్యనేతలంతా హైదరాబాద్లో ఒక్కొక్కరుగా అడుగుపెడుతున్నారు. దేశంలోని 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుటికీ కాంగ్రెస్ ఫోకస్ మాత్రం తెలంగాణ మీదే. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా తమకు అవకాశం ఉందని.. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని.. బీఆర్ఎస్ కు అసలైన ప్రత్యామ్నాయంగా తామే ఎదిగామని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటున్నది. అందుకే తెలంగాణ మీద దృష్టి పెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ ఫుల్ ఫోకస్ పెట్టింది. స్థానిక నేతలే కాకుండా.. అధిష్ఠానం మొత్తం తెలంగాణ మీదే గురిపెట్టింది. కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యనేతలంతా తెలంగాణ రాష్ట్రం మీదే ఫోకస్ పెట్టారు. పక్క రాష్ట్రంలో గెలవడంతో తెలంగాణ మీద హస్తం పార్టీకి ఆశలు చిగురించాయి. అందుకే తెలంగాణలో ఈ సారి అవకాశాన్ని వదులుకోవద్దని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్యనేతలంతా తెలంగాణలో అడుగుపెట్టారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తమ మీద ఉన్న అభిమానాన్ని ఓటు బ్యాంక్ గా మలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకనుగుణంగా రాష్ట్రంలో పరిస్థితులు కూడా హస్తం పార్టీకి అనుకూలంగా మారాయి. ఈ నెల 16, 17( శని, ఆదివారాల్లో) కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం, భారీ బహిరంగ సభ జరగబోతున్నాయి.
నేతలకు రేవంత్ హుకుం ఇదే..
తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభను నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. ఈ సభ ద్వారానే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నది. ఈ మీటింగ్ లో సోనియా గాంధీ పాల్గొని కీలక హామీలు ఇవ్వబోతున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో మరోసారి సెంటిమెంట్ రగిలించేలా చేయాలని ఆ పార్టీ భావిస్తున్నది. మరోవైపు స్థానిక కాంగ్రెస్ నేతలకు సైతం ఈ సభ పెను సవాల్ గా మారింది. భారీగా జనాన్ని తరలించాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే టార్గెట్ లు విధించారు. ప్రతి నియోజకవర్గానికి చెందిన దాదాపు 5 నుంచి 10 వేల మందిని తరలించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మాత్రమే కాక.. స్థానిక లీడర్లకు సైతం ఈ సభ ఎంతో ముఖ్యం. అందుకే ప్రతి నేత శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు.
కుమ్ములాటలు వీడుతారా?
సహజంగా కాంగ్రెస్ పార్టీనే అంటేనే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. ఆ పార్టీలో ఎన్ని వర్గాలుంటాయో కూడా చెప్పడం కష్టం. కానీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కచ్చితంగా గ్రూపు రాజకీయాలు విడిచిపెట్టాలని.. పార్టీ హైకమాండ్ స్ట్రాంగ్ గా ఆదేశాలు జారీచేసిందని తెలిసింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య సమావేశాలు కాబట్టి.. లోకల్ లీడర్స్ సైతం విబేధాలు పక్కకుపెట్టి పార్టీ కోసం పనిచేస్తారా? అన్నది వేచి చూడాలి. ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లోనే ప్రస్తుతం లీడర్లు బలప్రదర్శన చేయడం ఖాయం. తాము టికెట్ దక్కించుకోవాలంటే సభకు జనాలను తరలించడం కూడా ఓ ప్రాతిపదికగా తీసుకుంటారు కాబట్టి.. లోకల్ లీడర్లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని సభను సక్సెస్ చేయాలని చూస్తున్నారు.
మీడియా ఫోకస్ కాంగ్రెస్ మీదే..
తెలంగాణ రాష్ట్రంలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగుతున్నాయి కాబట్టి నేషనల్ మీడియా ఫోకస్ కూడా ఇక్కడే ఉండే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పీసీసీ అధ్యక్షులు, ముఖ్య నేతలు హైదరాబాద్ రాబోతున్నారు. మరోవైపు సీడబ్ల్యూసీ సమావేశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. దీంతో జాతీయ మీడియా మొత్తం తెలంగాణ మీదే ఫోకస్ పెట్టే చాన్స్ ఉంది. దీంతో ఇతర పార్టీలు సైతం అటెన్షన్ తమ వైపుకు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
సెంటిమెంట్ + కీలక హామీలు
కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు పక్కా వ్యూహాలు రచిస్తున్నది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా సెంటిమెంట్ రగిల్చడంతో పాటు కీలక హామీలను కూడా ఇవ్వబోతున్నది. గత ఎన్నికల సమయంలో సైతం తెలంగాణ ఇచ్చిన పార్టీగా తమకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ జనంలోకి వెళ్లింది. కానీ అప్పుడు వివిధ కారణాల వల్ల తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదు. గత ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి చేటు తెచ్చింది. దీంతో వచ్చే ఎన్నికల్లో పక్కాగా సెంటిమెంట్ ను రగిలించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
తాజ్ కృష్ణకు చేరుకున్న కీలక నేతలు
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యనేతలు హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్కు చేరుకుంటున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీతోపాటూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తాజ్ కృష్ణకు చేరుకున్నారు. రెండ్రోజులపాటు హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. మరోవైపు తుక్కుగూడలోని బహిరంగసభ స్థలి ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ నేతలు పరిశీలించారు.