Hyderabad Clock Towers : క్లాక్ టవర్ల చరిత్ర.. స్వార్థం ఏంటి..
Hyderabad Clock Towers – హైదరాబాద్ లో అడుగడుగునా కనపడే చారిత్రక కట్టడాలు క్లాక్ టవర్లు.
పూర్వం టైం తెలుసుకోవాలంటే జనాలు ఎండను చూసి నీడ ఎక్కడ ఉందనేది గమనించి పెద్దవారు సమయాన్ని గుర్తించేవారు.
ఆ తరువాత కాలంలో ఆధునిక సామ్రాజ్య కాలంలో కాస్త అప్ డేట్ అయిన ప్రజలు అప్పటి ప్రదాన జంక్షంన్లలోకి వచ్చి అక్కడ ఏర్పాటుచేసిన క్లాక్ టవర్లలో టైం చూసుకునేవారు.
నగరంలో ఉన్న దాదాపు 12 క్లాక్ టవర్లు హైదరాబాద్ చరిత్రకు సాక్ష్యాలు.
అందులో 9 హైదరాబాద్ పరిధిలో ఉండగా, మూడు సికింద్రాబాద్ పరిధిలో ఉన్నాయి.
నగరంలోని సికింద్రాబాద్, మహబూబ్ చౌక్, మొజాంజాహి మార్కెట్, చార్మినార్, జేమ్స్ స్ట్రీట్, సుల్తాన్ బజార్, ఫతే మైదాన్, సెయింట్ జార్జ్, శాలిబండ ల్లో ఈ క్లాక్ టవర్లు మనకు కనపడతాయి.
వీటి వయస్సు 100 సంవత్సరాలకు పైమాటే… వీటి ఏర్పాటుకు ముఖ్య కారణం దేశంలో బ్రిటిష్ పాలన ఉన్న సమయంలో హైదరాబాద్ లో నిజాం పాలన ఉండేది.
1806వ సంవత్సరంలో నిజాంకు బ్రిటిష్ సైన్యంతో సైన్య సహకార ఒప్పందం వల్ల బ్రిటీష్ సైనికులు హైదరాబాద్ లో పలు చోట్ల తమ స్థావరాలను ఏర్పరుచుకున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ వంటి ప్రాంతాల్లో బ్రిటీష్ ఆఫీసుల్లో తెలుగు వారు కూడా పని చేసే వారు.
అప్పట్లో చేతి గడియారాలు లేక పోవడంతో సైనికులకు, పని చేసే వారికి సమయం తెలిసేందుకు ప్రదాన జంక్షన్లలో ఈ క్లాక్ టవర్లను నిర్మించారు అప్పటి బ్రిటీష్ అధికారులు, నిజాం పాలకులు.
సమయానికి విదులకు రాని వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ క్లాక్ టవర్లు ఎంతగానో ఉపయోగపడేవి.
ఇప్పుడున్న క్లాక్ టవర్లలోని గడియారాలన్నీ లండన్ లో తయారయ్యి దిగుమతి చేసుకున్నవే.
అంతకు ముందు కేవలం అమెరికా, లండన్ లలో మాత్రమే ఈ క్లాక్ టవర్లు కనపడేవి.
10 ఎకరాలలో సికింద్రాబాద్ క్లాక్ టవర్
నగరంలో ఏర్పాటు చేసిన వాటిలో సికింద్రాబాద్ క్లాక్ టవర్ ఎంతో ప్రముఖమైనది.
1860లో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 2.5 ఎకరాల పార్కులో నిర్మించిన ఈ టవర్ 1897 ఫిబ్రవరి 1న సర్ ట్రెవర్ జాన్ చిచెల్ ప్లోడెన్ చేతుల మీదుగా ప్రారంభించబడింది.
120 అడుగుల ఎత్తుతో దీనిని నిర్మించారు. దీనిలో ఉన్న గడియారాన్ని అప్పటి ప్రముఖ వ్యాపారవేత్త దివాన్ బహదూర్ సేఠ్ లక్ష్మీనారాయణ రాంగోపాల్ విరాళంగా ఇచ్చారు.
దాంతో పాటు కోటి రెసిడెన్సీలో 1865లో సుల్తాన్ బజార్ క్లాక్ టవర్ ను నిర్మించారు. దీనిని 1981 లో ఈ క్లాక్ టవర్ ను హెరిటేజ్ ప్రాపర్టీగా గుర్తించారు.
చార్మినార్ గడియారాల విలువ అప్పుడే 1.5 లక్షలు
చార్మినార్ కట్టడంలోనూ చారిత్రక గడియారాలున్నాయి.
అసఫ్ జాహీ రాజులలో ఆరవ రాజైన మహబూబ్ అలీఖాన్ 1889 లో లండన్ నుండి తెప్పించిన నాలుగు గడియారాలను చార్మినార్ కు నాలుగు వైపులా ఏర్పాటు చేశారు.
వాటిలో ఉత్తరం వైపు ఉన్న గడియారం విలువ రూ.60 వేల రూపాయలు, మిగతా గడియారాల విలువ ఒక్కొక్కటీ రూ. 30 వేల రూపాయలు. అంటే ఆ కాలంలోనే చార్మినార్ లోని గడియారాల విలువ అక్షరాలా లక్షా యాబై వేలు.
నిజాం ప్రభుత్వం 1850 లో మహాబూబ్ చౌక్లో మొదటి సాలర్జంగ్ ఆద్వర్యంలో నిర్మించారు.
అనంతరం 1903 లో ఫతే మైదాన్ లో మరొక క్లాక్ టవర్ ఏర్పాటు చేసారు.
దీనిని ఆరో నిజాం సంస్థానంలో రక్షణ మంత్రిగా విధులు నిర్వహిం చిన నవాబ్ జఫర్ జంగ్ బహదూర్ ఫతేమైదాన్ క్లాక్ టవర్ను నిర్మించి ఆరో నిజాంకు బహూకరించారు.
1935లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మొజంజాహీ మార్కెట్ గడియారం ఏర్పాటు చేశారు.
దీన్ని నిజాం ప్రభుత్వం నిర్మించింది. మిగతా గడియారాలన్నీ ఇతరులు చరిత్రలో నిలిచిపోయేందుకు బహుమానంగా నిర్మించినవే.
అటువంటి క్లాక్ టవర్లలో చాలా వరకు క్లాక్ టవర్లు నిర్లక్ష్యం, పెరుగుతున్న రద్దీతో అంతరించిపోయే స్థితికి చేరుతున్నాయి.