– సీఎం రేవంత్ మదిలో ఆలోచన
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ఎన్నికల ముందు మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన మైనంపల్లి ఓటమి పాలు కాగా.. ఆయన కుమారుడు రోహిత్ విజయం సాధించారు. ఎన్నికల ముందు పార్టీలో చేరిన పొంగులేటి, జూపల్లి, తుమ్మల నాగేశ్వరరావు గెలుపొందడంతో వారికి కేబినెట్ లోనూ అవకాశం దక్కింది. ఇక మైనంపల్లి గెలిచిఉంటే ఆయనకు కూడా కచ్చితంగా మంత్రి పదవి వచ్చేది. అయితే తాజాగా మైనంపల్లికి కూడా కీలక పదవి దక్కబోతున్నదని సమాచారం. రేవంత్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రి మండలిలో చేర్చుకోబోతున్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంత్రులు మాత్రమే ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ క్యాబినెట్లో 18 మందికి చోటు ఉంది. ఇంకా ఆరుగురు మంత్రులకు అవకాశం రావాల్సి ఉంది. అయితే ఆ ఆరు సీట్లలో ఒక సీటు మైనంపల్లి హనుమంతరావుకి ఇవ్వబోతున్నారని సమాచారం. మరోపక్క మైనారిటీల నుంచి ఒక్క నేత కూడా రేవంత్ కేబినెట్లో లేరు. దాంతో ఫిరోజ్ ఖాన్ అవకాశం ఇవ్వబోతున్నారని సమాచారం. వీరికి మంత్రి పదవులు ఇస్తే గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని రేవంత్ రెడ్డి లెక్కలు వేసుకుంటున్నారట. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ సీట్లు తెచ్చుకున్నది. కానీ గ్రేటర్ పరిధిలో మాత్రం పెద్దగా విజయం సాధించలేదు. దీంతో గ్రేటర్లో పట్టు పెంచుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది.