బిగ్బాస్ తెలుగు సీజన్ 2 కంటెస్టెంట్ నూతన్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఇంట్లో పనిచేస్తున్న దళిత యువకునికి శిరోమండలం చేసిన కేసులో నూతన్తో పాటు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. అనంతరం ఈ కేసులో తన కుటుంబ సభ్యులతో పాటు నూతన్ నాయుడుకు కూడా సంబందం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.
దీంతో నూతన్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి విచారణ అనంతరం నూతన్ నాయుడుకు ఇందులో సంబందం ఉందని నిర్ధారణ అయిన తర్వాతే అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ సీపీ మనీష్కుమార్ సిన్హా వెల్లడించారు. ఈ కేసు బయటకు వచ్చినప్పటి నుంచి నూతన్ నాయుడు పరారీలో ఉన్నాడు. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నూతన్ భార్య మధుప్రియను కాపాడేందుకు ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పేరిట ఫేక్ కాల్స్ చేసి అధికారులను తప్పుదోవ పటంటించేందుకు నూతన్ నాయుడు ప్రయత్నించినట్టుగా పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నూతన్ నాయుడును శుక్రవారం కర్ణాటకలోని ఉడిపిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు పారిపోయేందుకు నూతన్ ఏర్పాట్లు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.