– మోడీ వేవ్పై బీజేపీ ఆశలు
– గెలుపు ఊపులో హస్తం పార్టీ
– నాలుగు సెగ్మెంట్లలో బీఆర్ఎస్ విజయం
– చేవెళ్ల ఇన్ చార్జ్ ముఖ్యమంత్రి రేవంత్
– సీఎం అయ్యాక ఫస్ట్ టాస్క్
– సర్వశక్తులు ఒడ్డనున్న ముఖ్యమంత్రి
– హాట్ సీట్ లో మూడు పార్టీల హోరాహోరీ
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: చేవెళ్ల నియోజకవర్గంపై ఇప్పుడు రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఫోకస్ పెట్టాయి. బీజేపీ మోడీ వేవ్ ను నమ్ముకున్నది. ఇక ఇటీవల అధికారంలో రావడంతో కాంగ్రెస్ పార్టీ సైతం గెలుపు ఊపు మీద ఉన్నది. మరోవైపు ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ ఇన్ చార్జ్ కావడంతో ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనున్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలిచింది. ఈ నియోజకవర్గం సెమీ అర్బన్ కావడం తమకు కలిసొస్తుందని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటున్నది. దీంతో చేవెళ్ల మీద ఫుల్ ఫోకస్ ఏర్పడింది. చేవెళ్ల నియోజకవర్గంలో 20 లక్షల ఓట్లు ఉన్నాయి. మహేశ్వరం, శేరిలింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో మహేశ్వరం, శేరిలింగంపల్లి, చేవెళ్ల, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ గెలుచుకోగా.. పరిగి, వికారాబాద్, తాండూర్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మహేశ్వరం, శేరిలింగంపల్లిలో బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉంది.
ఇది కూడా చదవండి: ఆడవారికి బిగ్ షాక్.. ఇక ఫ్రీ బస్సు ప్రయాణం కష్టమేనా..?
నియోజకవర్గ గత చరిత్ర ఇదీ..
2009లో ఇక్కడ సూదిని జైపాల్ రెడ్డి విజయం సాధించారు. 2014లో కొండా విశ్వేశ్వర్రెడ్డి విజయం సాధించారు. 2019లో రంజిత్ రెడ్డి విజయం సాధించారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. 2019లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి కేవలం 14వేల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ తరఫున బరిలో నిలిచే చాన్స్ ఉంది. 2014లో ఆయన గెలుపొందడం.. 2019లో స్వల్ప తేడాతో ఓడిపోవడం ఆయనకు కలిసివచ్చే అంశం.. సెమీ అర్బన్ సెగ్మెంట్ కావడంతో మోడీ వేవ్, అయోధ్య అంశాలు కలిసి వస్తాయేమోనని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: రూ.400తో అయోధ్యకు ఈజీగా వెళ్లండి.. ఇలా
ఇక ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి రంజిత్ రెడ్డి పోటీ చేసే చాన్స్ ఉంది. కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తారన్నది క్లారిటీ లేదు. కానీ కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డికి టికెట్ వస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్ఆనయి. మరోవైపు ఈ పార్లమెంటు సెగ్మెంట్ కు రేవంత్ రెడ్డి ఇన్ చార్జ్గా ఉన్నారు. ఇక కేఎల్ఆర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే పార్లమెంటు పరిధిలోని మహేశ్వరం సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు చేవెళ్ల పార్లమెంటు పరిధిలో పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి. చేవెళ్ల పార్లమెంటు బరిలో ఉండబోతున్న రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆర్థికంగా ఎంతో బలమైన నేతలు. కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి కూడా ఆర్థికంగా బలమైన నేతే. దీంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా సాగే చాన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఈ సీటు కోసం ముగ్గురు, నలుగురు పోటీ పడుతున్నప్పటికీ లక్ష్మారెడ్డికే టికెట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్
సీఎంకు ఎంతో ప్రతిష్ఠాత్మకం
ఈ నియోజకవర్గం సీఎం రేవంత్ రెడ్డికి ఎంతో ప్రతిష్ఠాత్మకం. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఇదే తొలి టాస్క్. కనక రేవంత్ రెడ్డి ఇక్కడ సర్వ శక్తులు ఒడ్డే అవకాశం ఉంది. పైగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో పవర్ లో ఉంది కనక ఆ పార్టీకి ఈ ఎన్నికల కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక కొండా విశ్వేశ్వర్ రెడ్డి గతంలో ఓ సారి గెలుపొందారు. ఈ సారి మోడీ వేవ్ కలిసి వస్తుందని చూస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి వివాద రహితుడు. అంతేకాక అర్బన్ లో బీఆర్ఎస్ పార్టీ ఇంకా బలంగా ఉండటం ఆయనకు కలిసివచ్చే అవకాశం. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనైనా ఏ పార్టీ బలంగా ఉందంటే కచ్చితంగా చెప్పొచ్చు. కానీ చేవెళ్లపై అలా చెప్పేందుకు చాన్స్ లేదు. ఇక్కడ అన్ని పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ నియోజకవర్గం రాష్ట్రంలో హాట్ సీటుగా మారే చాన్స్ ఉంది. మరి ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.