చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణకు కేర్ అఫ్ అడ్రస్ అయితే, జగన్ విద్వేష వికేంద్రీకరణకు బ్రాండ్ అంబాసిడర్ అని ట్విట్టర్ వేధికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. టీడీపీ హయాంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ ఫలాలు అన్ని జిల్లాలకు ఎలా అందాయో వైకాపా ప్రభుత్వమే పూసగుచ్చినట్టు బయటపెట్టింది అన్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో 39,450 పరిశ్రమలు వచ్చాయని, వాటి ద్వారా 5,13,351 ఉద్యోగాలు, ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు, అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న 137 కంపెనీల ద్వారా 2,78,586 ఉద్యోగాలు రాబోతున్నాయి అని వైకాపా ప్రభుత్వం బల్ల గుద్ది మరీ చెబుతోంది అని లోకేష్ పేర్కొన్నారు. 14 నెలల జగన్ పాలనలో రాష్ట్రానికి గుడ్ బై చెప్పిన కంపెనీలే తప్ప వచ్చిన ఒక్క కంపెనీ అయినా ఉందా? అని ప్రశ్నించారు లోకేష్.